అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసింది.. జులై 24 నాటికి రాష్ట్రంలో నమోదైన 4,16,27,694 మంది ఓటర్లలో 3,71,38,182 మంది ఎన్యూమరేషన్ ఫారమ్లు సమర్పించినట్లు వెల్లడించింది. ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లు ఆగస్టు 30 వరకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం 15.22 లక్షల మంది ఓటర్లు మరణించగా, 22.30 లక్షల మంది శాశ్వతంగా నివాసం మార్చుకుని ఎన్యూమరేషన్ ఫారమ్లు సమర్పించలేదు. అలాగే 7.37 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు గుర్తించారు.
ముసాయిదా జాబితాలో తమ పేరు కనిపించని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన ఓటర్లు అధికారిక ఎన్నికల వెబ్సైట్లో ఫారం-6 సమర్పించడం ద్వారా మళ్లీ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియకు జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు గడువు నిర్ణయించారు. దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, అవసరమైన ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ మాట్లాడుతూ, నోటీసు ఇవ్వకుండా లేదా విచారణ నిర్వహించకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని స్పష్టం చేశారు. ప్రతి అర్హుడైన ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేరు ఒకసారి పరిశీలించుకుని, ఏవైనా లోపాలు ఉంటే గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల వివరాల పరిశీలన, ఫారం-6 సమర్పణ, అభ్యంతరాల నమోదు వంటి సేవల కోసం భారత ఎన్నికల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని ఎన్నికల అధికారులు సూచించారు.
ఓటర్లు అధికారిక వెబ్సైట్లో తమ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి భారత ఎన్నికల సంఘం (Election Commission of India) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO Andhra Pradesh) అధికారిక వెబ్సైట్ విజిట్ చేసి చెక్ చేసుకోండి.
ఫారం-6తో ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేయాలి?
ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లు ఇంటి నుంచే ఆన్లైన్లో ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నికల సంఘం ECI Voters’ Service Portal లేదా Voter Helpline యాప్ను ఉపయోగించాల్సి ఉంటుంది.
– ముందుగా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీతో పోర్టల్లో సైన్ అప్ చేసి ఖాతా సృష్టించాలి. ఇప్పటికే ఖాతా ఉంటే నేరుగా లాగిన్ కావచ్చు.
– అనంతరం New Voter Registration విభాగంలో ఉన్న ఫారం-6ను ఎంచుకుని రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
– తర్వాత పాస్పోర్ట్ సైజు ఫోటో, వయస్సు ధ్రువీకరణ పత్రం, చిరునామా ఆధారం వంటి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. వివరాలను ఒకసారి సరిచూసుకుని దరఖాస్తును సమర్పిస్తే రిఫరెన్స్ ఐడీ జారీ అవుతుంది.
– ఈ రిఫరెన్స్ ఐడీ ద్వారా దరఖాస్తు ఏ దశలో ఉందో పోర్టల్లో Track Application Status ద్వారా తెలుసుకోవచ్చు.
– అనంతరం బూత్ లెవల్ ఆఫీసర్ (Booth Level Officer) వివరాలను పరిశీలించి, దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత “e-EPIC (డిజిటల్ ఓటర్ ఐడీ)”ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
– భౌతిక ఓటర్ ఐడీ కార్డు తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా చిరునామాకు పంపబడుతుంది.
ఇది కూడా చదవండి: Ration Card e-KYC: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. e-KYC లేకున్నా రేపటి నుంచి 3 నెలల రేషన్ పంపిణీ






