హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మరో విడతగా రూ.2 వేల కోట్ల ఉద్యోగుల బకాయిల విడుదలకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ తాజా నిర్ణయంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుల విషయంలో వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది.
ఈ ఏడాది ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల్లో బకాయిలను విడుదల చేసింది. మే 29న తొలి విడతగా రూ.2 వేల కోట్లు, జూన్ 30న రెండో విడతగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా మూడవ విడతగా రూ.2 వేల కోట్లను మంజూరు చేసింది. వరుసగా మూడు విడతల్లో మొత్తం 6000 వేల కోట్లు నిధులు విడుదల చేయడంతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిల చెల్లింపులు పూర్తయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
ఎన్నో నెలలుగా బకాయిల కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. రిటైర్మెంట్ అనంతరం రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యమవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురికి తాజా చెల్లింపులు ఉపశమనం కలిగించనున్నాయి. అయితే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలతోనే ప్రభుత్వం ఆగిపోదని స్పష్టం చేసింది. ఇంకా పెండింగ్లో ఉన్న ఇతర బకాయిలను కూడా దశలవారీగా విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో మిగిలిన చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల్లో కూడా ఆశలు పెరిగాయి.
ఇది కూడా చదవండి – ఇందిరమ్మ ఇళ్లపై సోషల్ మీడియాలో వదంతులు.. కీలక ప్రకటన చేసిన హౌసింగ్ బోర్డు VC గౌతమ్.
బకాయిల విడుదలపై ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే వేగంతో మిగిలిన బకాయిలను కూడా విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ దశలవారీగా పెండింగ్ చెల్లింపులను క్లియర్ చేస్తుండటం ఉద్యోగ వర్గాల్లో సానుకూల చర్చకు దారితీసింది. మిగిలిన బకాయిల విడుదలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.






